
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే సోషల్ మీడియా యాప్స్లో ఇన్స్టాగ్రాం ఒకటి. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇన్స్టాగ్రాం వాడుతూనే ఉంటారు. అలాంటి ఇన్స్టాలో బగ్స్ ఉంటే హ్యాకర్లు ఎన్ని ఖాతాలైనా హ్యాక్ చేసేందుకు వీలుంటుంది. ఇలాంటి ఒక బగ్ను కనిపెట్టిన జైపూర్ స్టూడెంట్కు ఆ కంపెనీ భారీ నజరానా ఇచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జైపూర్కు చెందిన నీరజ్ శర్మ అనే యువకుడు తన ఇన్స్టాగ్రాం ఖాతాలో ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. అసలు అది ఎలా కుదురుతుందని కష్టపడి తెలుసుకున్నాడు. దీంతో అకౌంట్ వివరాలు తెలియకపోయినా కూడా మనం పోస్టు చేసే రీల్స్ థంబ్నైల్స్ను సులభంగా మార్చేయొచ్చని, జస్ట్ ఏ ఖాతాలో రీల్స్ అప్లోడ్ అయ్యాయో దాని ఐడీ తెలిస్తే చాలని నీరజ్కు అర్థమైంది.
ఈ విషయాన్ని జనవరి నెలలో కనుక్కున్న నీరజ్.. అప్పుడే ఇన్స్టాగ్రాం యాజమాన్యానికి తెలియజేశాడు. మూడ్రోజుల తర్వాత అతన్ని సంప్రదించిన వాళ్లు.. అతను చెప్పిన సమస్యను వివరించాలని, తమకు డెమో ఇవ్వాలని అడిగారు. అతను స్పష్టంగా ఇచ్చిన డెమో చూసి సమస్యను అంగీకరించారు. ఆ తర్వాత వాళ్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే తాజాగా అతనికి ఇన్స్టాగ్రాం నుంచి మెయిల్ వచ్చింది.
ఈ బగ్ను కనిపెట్టి లక్షలాది ఖాతాలు హ్యాక్ అవ్వకుండా కాపాడినందుకు నీరజ్ను మెచ్చుకున్న ఇన్స్టాగ్రాం.. అతనికి 45 వేల డాలర్లు (రూ.35 లక్షలపైగా) బహుమతి అందించింది. అదే సమయంలో ఈ బహుమతి ఇవ్వడానికి నాలుగు నెలలు ఆలస్యం అయిన కారణంగా మరో 4500 డాలర్లు (సుమారు రూ.3 లక్షలపైగా) అదనంగా ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో నీరజ్ ఖాతాలో రూ.38 లక్షలపైగా సొమ్ము చేరింది.