రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలనే పునరావృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పదాధికారుల సమావేశంలో పార్టీని పటిష్ఠపరిచేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజెపీ జాతీయ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా నిరుద్యోగుల ఓటుబ్యాంకును లక్ష్యంగా చేసుకోవాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. నల్లగొండ, వరంగల్, ఖమ్మంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని ప్రతి 25 మంది గ్రాడ్యుయేట్లకు ఒక ఇన్చార్జి చొప్పున మొత్తం 40వేల మంది ఇన్చార్జిలను నియమించాలని బీజేపీ నిర్ణయించింది.

ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు, అనంతరం మునిసిపల్ ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని తీర్మానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాగర్ ఉప ఎన్నికల ప్రచారాన్ని గురువారం హాలియాలో నిర్వహించే బహిరంగసభతో ప్రారంభించనుందని పేర్కొన్నాయి. ‘‘రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులను రంగంలోకి దించనున్నాం’’ అని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక.. ‘హైదరాబాద్’ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్రావు, ‘నల్లగొండ’ నియోజకవర్గ ఇన్చార్జిగా ఇ.పెద్దిరెడి నియమితులయ్యారు.