ఎన్నికల ఏర్పాట్లపై ఓటర్లలో విశ్వాసం కలిగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఆదివారం ఉదయం ఆయన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉల్లంఘనలపై, ఎన్నికల ప్రచారంలో నగదు పంపిణీ, మద్యం సరఫరా పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ అధికారులను, ఎస్ఈసీ అప్రమత్తం చేశారు. కోడ్ ఉల్లంఘనల విషయంపై ప్రత్యేక టీంలు పనిచేస్తున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది.

ఆ పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లకు చర్చ…
గతంలో ఒక్క నామినేషన్ కూడా వేయకుండా ఆగిన పంచాయతీ ఎన్నికలు ఈ నెల 15న నిర్వహించనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబుతో భేటీ అయ్యారు. 15న నిర్వహించనున్న 12 పంచాయతీలు, 360 వార్డుల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై పంచాయతీరాజ్ తీసుకుంటున్న చర్యలను కమిషన్కు వివరించినట్లు సమాచారం.