సారా తయారీ, విక్రయాలకు అడ్డాగా మారిన పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు దక్షిణతెలుగుపాలెం గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఐదు వేల లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. 100 లీటర్ల సారా, తయారీ కోసం వినియోగించే కాగులు, క్యానులు, పీపాలు, గ్యాస్ పొయ్యిలు స్వాధీనం చేసుకున్నారు. తయారీదారులు మాత్రం దొరకలేదు. వారెవరో గుర్తించి కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ మసూంబాషా తెలిపారు. సారా తయారీ, అమ్మిని పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఆయన హెచ్చరించారు. సారాను అరికట్టడానికి నిరంతరం దాడులు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. డీఎస్పీలు శంకర్, ప్రభాకర్, సీఐలు కొండయ్య, శ్రీనివాస్, అంకబాబు, ఎస్సైలు మురళి, దుర్గాప్రసాద్, తులసి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
