కాలేజీ ఫీజు యమపాశమైంది. రెండేళ్లుగా ఎదురుచూసిన ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోయేసరికి..

కళాశాల ఫీజులు చెల్లించే స్థోమత లేక, తల్లిదండ్రుల దీనావస్థ చూడలేక.. మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థిని బలవంతంగా తనువు చాలించింది. కన్నవారికి భారం కావడం ఇష్టంలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గొడుగుపాలెంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఒంగోలులో బంగారం పనులు చేసుకునే పాపిశెట్టి నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. చిన్న కుమార్తె పి తేజశ్రీ (20) స్థానిక క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది. రెండేళ్లుగా ఆ కళాశాలకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. దీంతో ఫీజుల కోసం విద్యార్థులపై యాజమాన్యం ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫీజు చెల్లించడం కోసం తేజశ్రీ తండ్రి నాగేశ్వరరావు అధిక వడ్డీకి అప్పులు చేశారు. విషయం తెలుసుకున్న తేజశ్రీ మానసిక వేదనకు గురైంది. తల్లిదండ్రులకు తాను ఆర్థిక భారం కాకూడదని భావించి శుక్రవారం రాత్రి చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తండ్రి పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఒంగోలు వన్టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన
ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం ఆ కుటుంబానికి ఆర్థిక భారంగా మారిందని, ఆ బాధతోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని తేజశ్రీ సహచర విద్యార్థలు, పలు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. తేజశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ శనివారం మృతదేహంతో వారు ఆందోళనకు దిగారు. సుమారు 400 మంది విద్యార్థులు రిమ్స్ నుంచి చర్చి సెంటర్ వరకు ప్రదర్శనగా వచ్చి రస్తారోకో చేశారు. ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్రెడ్డి, డీఎస్పీ ప్రసాద్లకు వినతిపత్రం అందజేశారు. తేజశ్రీ కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కళాశాల గుర్తింపును రద్దుచేయాలని, ఫీజులు కోసం ఒత్తిడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..: పవన్కల్యాణ్
అమరావతి, : ఫీజుల బకాయిల వల్ల పరీక్షలు రాయలేని పరిస్థితిలో బీటెక్ విద్యార్థిని తేజశ్రీ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందన్నారు. ప్రభుత్వం పేదలను చదువులకు దూరం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించాలని, తేజశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేశారు.