రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ శనివారం జరగనుంది. రెండో దశలో 13 జిల్లాల్లో, 18 రెవెన్యూ డివిజన్లలోని 167 మండలాల్లో 3,328 పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 33,570 వార్డు సభ్యులకు గాను నోటిఫికేషన్ జారీచేయగా… 539 సర్పంచ్లు, 12604 వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో సర్పంచ్ స్థానం చొప్పున మొత్తం మూడు చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అలాగే 149 చోట్ల వార్డు సభ్యులకు ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. దీంతో ఏకగ్రీవాలు పోను 2,786 సర్పంచ్లకు, 20,817 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 44,876 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) 29,304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది.అందులో 5,480 కేంద్రాలను సమస్యాత్మకంగా, 4,181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించింది. 18,387 పెద్ద, 8,351 మధ్యరకం, 24,034 చిన్న బ్యాలెట్ బాక్సులను సిద్ధంచేసింది. శనివారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
ఆ తర్వాత ఉపసర్పంచ్ ఉప ఎన్నిక ఉంటుంది. రెండో దశలో 1,292 మంది స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులుగా, 3,427 మంది స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులుగా, 1,370 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా, 33,835 ప్రిసైడిండ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. మరో 47,492 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు డిస్ర్టిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఇవి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, సామగ్రిని సరఫరా చేస్తాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం అన్ని కేంద్రాలకు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, హ్యాండ్ గ్లౌవ్స్ను అవసరమైన సంఖ్యలో సిద్ధంచేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా పోలింగ్ కేంద్రం పరిధిలో కొవిడ్ పాజిటివ్ బాధితులుంటే పీపీఈ కిట్లు ఏర్పాటుచేస్తున్నామని, వారికి చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ‘కౌంటింగ్ సెంటర్లలో పటిష్ఠ భద్రతకు ఏర్పాట్లు చేశాం.
ఓట్ల లెక్కింపునకు 16,788 మంది సూపర్వైజర్లు, 32,141 మంది సిబ్బందిని నియమించాం. ఎన్నికల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లాకొకరు చొప్పున 13 మంది అధికారులను పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో నియమించాం. వారికి కేటాయించిన జిల్లాల యంత్రాంగంతో మాట్లాడుతూ అవసరమైన సహాయసహకారాలను అందజేస్తారు. పోలింగ్ సరళిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు పంచాయతీరాజ్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుచేశాం’ అని పేర్కొన్నారు.
పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్లు..
టెక్కలి, పాలకొండ (10 మండలాలు), పార్వతీపురం (15), నర్సీపట్నం (10), రాజమండ్రి, రంపచోడవరం (14), కొవ్వూరు (13), గుడివాడ (9), నరసరావుపేట (11), ఒంగోలు, కందుకూరు (14), ఆత్మకూరు(నెల్లూరు జిల్లా-10), కర్నూలు, నంద్యాల (13), ధర్మవరం, కల్యాణదుర్గం (19), కడప (12), మదనపల్లె (17 మండలాలు).