‘వరి ఒక సోమరిపోతు వ్యవసాయం’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. బయటి జిల్లాలకు వెళ్లినప్పుడు రైతులకు తాను ఇదే విషయం చెబుతుంటానని తెలిపారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిన కృషి విజ్ఞానకేంద్రం రజతోత్సవంలో మంత్రి రంగనాథరాజు మాట్లాడారు. ‘సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఈగారు కాల్వలకు నీరు వదిలితే పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఒరేయ్ బాబూ ఆకుమడి దున్ను… అంటే వచ్చి దున్నుతాడు.

బస్తా విత్తనాలు పొలంలో పడేస్తే… ఇంతని డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి మాటలతో కిసాన్మేళాలో పాల్గొన్న రైతులు విస్తుపోయారు. ఆయన గతంలో రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఇదే సమయంలో… వరి సాగులో ఉన్న కష్టాలను కూడా మంత్రి వివరించారు. 90 శాతానికి మందిపైగా కౌలు రైతులే ఉన్నారని, ఇబ్బంది వస్తే వారే నష్టపోతున్నారని తెలిపారు. ఈసారి ఖరీ్ఫలో ధాన్యం దిగుబడి బాగా తగ్గిందన్నారు. ఊడ్పుల ఖర్చు కూడా రాలేదన్నారు. అంతర్జాతీయంగా బియ్యం రేటు ఎంత ఉందో… మన దేశంలో ధాన్యం రేటు అంత ఉందని చెప్పారు. వ్యవసాయంపై పెట్టే ఖర్చును తగ్గించాలని రైతులకు సూచించారు. శాస్త్రవేత్తల్లాగా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి కన్నబాబు కూడా పాల్గొన్నారు.