వైజాగ్‌ ఫిల్మ్‌ క్లబ్‌ కబ్జా!

0
190
Spread the love

విశాఖపట్నంలో ప్రముఖ సంస్థలపై కన్నేసి ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ వస్తున్న అధికార పార్టీ పెద్దలు..

ఇప్పుడు ఫిల్మ్‌ క్లబ్‌పై పడ్డారు. క్లబ్‌ను స్వాధీనం చేసుకొని కార్యవర్గం మొత్తం వైసీపీ నాయకులు, ఓ సామాజిక వర్గం వారితో నింపేశారు. పాత వారిని బయటకు నెట్టేశారు. ఎలాంటి చట్టబద్ధతా లేని ఈ కమిటీ ఆదివారం జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహిస్తోంది. సంస్థలో ఇప్పటికే సభ్యుల నుంచి ప్రవేశ రుసుముగా వసూలు చేసిన రూ.10 కోట్ల నిధులు ఉన్నాయి.

ఇదీ ఫిల్మ్‌ క్లబ్‌ కథ…

రాష్ట్ర విభజన తరువాత చిత్ర పరిశ్రమ విశాఖలో స్థిరపడుతుందని భావించి ఇక్కడ ఆ రంగానికి చెందిన వారి కోసం ఒక క్లబ్‌ ఉంటే బాగుంటుందని నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు, చిత్ర పరిశ్రమకు చెందిన కేఎస్‌ రామారావు, అశోక్‌కుమార్‌ తదితరులంతా కలిసి ‘వైజాగ్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో 400 మందికి సభ్యత్వం ఇచ్చారు. విశాఖలో చాలామంది సభ్యత్వాలు చేయించి నిధులు సమీకరించారు. ఆ విధంగా రూ.12 కోట్లు వచ్చాయి. క్లబ్‌కు స్థలం కావాలంటూ లేఖ రాస్తే తొట్లకొండపై కొంత భూమి కేటాయించారు. అది బుద్ధిస్టు ప్రాంతమని కొన్ని సంఘాలు కోర్టుకు వెళ్లడంతో ఆ కేటాయింపును రద్దు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఆఖరి కేబినెట్‌లో తిమ్మాపురంలో రామానాయుడు స్టూడియో దగ్గ ర 5ఎకరాలు కేటాయించినా ప్రక్రియ ముందుకుసాగలేదు.

లీజు స్థలంలో కార్యకలాపాలు

ప్రస్తుతం క్లబ్‌ నిర్వహణ కోసం తిమ్మాపురంలోనే 1.5 ఎకరాల స్థలం తీసుకొని అభివృద్ధి చేశారు. అద్దె, నిర్వహణ కోసం నెలకు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుండగా, ఆదాయం మాత్రం రూ.50 వేలకు మించి రావడం లేదు. లీజు కాలం మూడేళ్లు ముగిసిపోగా, మళ్లీ ఒప్పందం చేసుకున్నారు. కోర్‌ కమిటీకి కేఎస్‌ రామారావు చైర్మన్‌ కాగా, మరో 32 మంది సభ్యులు ఉండేవారు.

విచిత్రమైన నిబంధనలు

కోర్‌ కమిటీలో ఎవరైనా సభ్యులు ఏదైనా కారణంతో చనిపోతే.. ఆ స్థానాన్ని వారి కుటుంబ సభ్యులు/వారసులతోనే భర్తీ చేయాలనే నిబంధన పెట్టారు. ఇప్పుడు కొత్తగా కోర్‌ కమిటీలో చేరిన ఆ సామాజికవర్గం వారు ఎవరూ సభ్యత్వ రుసుము చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ కమిటీని సొసైటీల రిజిస్ట్రార్‌కు అందజేసి, ఆమోదించిన తరువాతే ప్రమాణ స్వీకారం జరగాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే ఈ నెల 7న జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించి, కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఏర్పాట్లు చేశారు.

పాత కమిటీ సభ్యుల ఆరోపణలు

ఒక రాజకీయ పార్టీకి చెందిన వారితో కమిటీని నింపడం నిబంధనలకు విరుద్ధం. గతంలో క్లబ్‌కు భూసేకరణకు కృషిచేసిన వారిని విస్మరించారు. కమిటీలో ఎవరినైనా నియమించాలంటే.. సభ్యులు ప్రతిపాదించాలనే నిబంధన పాటించలేదు. పార్టీలు మారినప్పుడల్లా కమిటీలను మార్చేస్తే చట్టం అంగీకరించదు.

వైసీపీ పెద్దల కన్ను.. వెంటనే స్వాధీనం

విశాఖపట్నంలో ఒక్కో సంస్థను శల్యపరీక్ష చేస్తున్న విజయసాయిరెడ్డి దృష్టిలో ఆరు నెలల క్రితం ఫిల్మ్‌ క్లబ్‌ పడింది. గత జనవరిలో కైవసం చేసుకున్నారు. పాత కోర్‌ కమిటీని రద్దు చేసి, 15 మందితో కోర్‌ కమిటీని వేసుకున్నారు. వైసీపీ నాయకులు ‘ప్రొటోకాల్‌ ప్రసాద్‌’గా పిలుచుకునే సాగి దుర్గాప్రసాద్‌రాజును అధ్యక్షునిగా నియమించారు. సినీ నటుడు కృష్ణ సోదరుడు (వైసీపీ) జి.ఆదిశేషగిరిరావును ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వేసి, విజయసాయిరెడ్డి అల్లుడు పి.రోహిత్‌రెడ్డిని వైస్‌ చైర్మన్‌గా పెట్టారు. విజయసాయిరెడ్డి వెనుక తిరిగే ఓ షాపింగ్‌ మాల్‌ యజమానిని, ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డిని సభ్యులుగా నియమించారు. కేఎస్‌ రామారావును కమిటీలో ఒక సభ్యుడిగా ఉంచారు. ఈ కమిటీ నిర్ణయాలను అమలు చేయడానికి మరో మేనేజింగ్‌ కమిటీని ఏర్పాటుచేశారు. అందులో రోహిత్‌రెడ్డినే వైస్‌ చైర్మన్‌గా వేశారు. కేఎస్‌ రామారావును అధ్యక్షునిగా ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here