రాష్ట్రంలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఐటీ శాఖ అధికారులను ఆదేశించారు.

విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు సమీపంలో కనీసం 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఐటీ కాన్సెప్ట్ సిటీల ఏర్పాటు దిశగా కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించారు. ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉండాలని, వీటిలో అత్యున్నతస్థాయి మౌలిక సదుపాయాలు ఉండాలని సూచించారు. ప్రతి కాన్సెప్ట్ సిటీకి ప్రత్యేకమైన మాస్టర్ప్లాన్ ఉండాలన్నారు. పాలసీలో ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలన్నారు. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఐటీ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. ఇంటర్నెట్ లైబ్రరీని ఏర్పాటు చేసి గ్రామంలో ఎవరైనా దీన్ని వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. దీనివలన వర్క్ ఫ్రం హోం చేసుకునే సదుపాయం ఉంటుందన్నారు.
ఈ-లైబ్రరీ కోసం భవనాలు కూడా కట్టాలన్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నింటినీ ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలన్నారు. ఇళ్లకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కల్పించాలన్నారు. విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు కూడా సీఎం జగన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీనిలో నైపుణ్య విశ్వవిద్యాలయం, ఇంక్యుబేషన్ సెంటర్, ల్యాబ్స్, సీవోఈఎస్, ఐటీ, ఈసీ శాఖ కార్యాలయం, రాష్ట్ర డేటా సెంటర్, ఐటీ టవర్స్ అన్నీ ఉండాలన్నారు.
కొత్త రంగాలు, పరిశోధనలపై దృష్టి
విశాఖపట్నంలో ఏర్పాటుచేసే ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ కొత్త రంగాలపై దృష్టిసారించాలని సీఎం నిర్దేశించారు.