‘మంత్రి ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారా ? అందుకే సీఎం కేసీఆర్ ఆదివారం నాటి సమావేశంలో కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదనే వ్యాఖ్యలు చేశారా?’ అనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. గతంలో.. ‘మేం టీఆర్ఎస్ జెండా ఓనర్లం.. కిరాయిదారులం కాదు’ అని వ్యాఖ్యానించిన ఈటల.. ఈ మధ్య రైతుల ఆందోళన, ధాన్యం కొనుగోలు అంశాలపై ప్రభుత్వాన్ని కొంత ఇరుకునపెట్టే విధంగా మాట్లాడారనే అభిప్రాయం పార్టీ ముఖ్యుల్లో వ్యక్తమైంది. ఈటల రాజేందర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నారనే విమర్శలూ వచ్చాయి. ఇదే క్రమంలో కేసీఆర్ స్థానంలో సీఎంగా కేటీఆర్ కంటే ఈటల అయితే బాగుంటుందనే వాదనలను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టాలన్న ఉద్దేశం ఉండడం వల్లే మంత్రి ఈటల స్వరంలో మార్పు వచ్చిందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఉండడంతోనే సీఎం కేసీఆర్ ఆదివారం నాటి టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదనే వ్యాఖ్యలు చేశారనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. కేసీఆర్ వ్యాఖ్యలు పరోక్షంగా ఈటల రాజేందర్ను ఉద్దేశించి చేసినవేనని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. అంతేకాక కొత్త పార్టీ పెట్టి, నిలబెట్టుకోవటం ఆషామాషీ కాదని, గతంలో ఎన్నో పార్టీలు మట్టిలో కలిసి పోయాయంటూ కేసీఆర్ ఉదహరించిన నేతలు నరేంద్ర, విజయశాంతి, దేవేందర్గౌడ్.. ముగ్గురూ బీసీ నేతలేనని, ఈటల రాజేందర్ కూడా బీసీ నాయకుడు కావడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’ సోమవారం ఫోన్ ద్వారా మంత్రి ఈటల దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన తీవ్రంగా ఖండించారు.