రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏ విధంగా ముందుకు పోతుందో తెలియంది కాదు. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోటి వృక్షార్చన పేరుతో కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17న ఒకే రోజు కోటి మొక్కలు నాటేలా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలందరూ సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి సపోర్ట్ అందిస్తూ.. అందరూ ఈ కార్యక్రమంలో భాగమై మొక్కలు నాటాలని కోరుతూ ఓ వీడియోని విడుదల చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్కి పుట్టినరోజు కానుక:
కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటి.. ముఖ్యమంత్రి కేసీఆర్గారికి పుట్టినరోజు కానుకగా అందిద్దాం అని తెలుపుతూ.. మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన వీడియోలో.. ”తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలి అని మన ముఖ్యమంత్రి కేసీఆర్గారి ఆకాంక్ష, కోరిక. దాని కోసం మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం అయి, మొక్కలు నాటుదాం.. మన ముఖ్యమంత్రిగారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం, వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుందాం..” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్.. ముఖ్యమంత్రి కేసీఆర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.