భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్లో సెమీఫైనల్కు దూసుకుపోయారు. అయితే పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్, అజయ్ జయరామ్, మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్/అశ్విని పొన్నప్ప జోడీ ఓటమి పాలయ్యారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21-16, 23-21తో ఐదో సీడ్ బుసానన్ ఓంగ్బాంగ్రంగ్పన్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో నాలుగో సీడ్ మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శ్రీకాంత్ 21-19, 21-15తో వాంగ్ చెరోయిన్ (థాయ్లాండ్)పై గెలిచాడు. కాగా.. సాయిప్రణీత్ 14-21, 17-21తో రెండో సీడ్ లీ జీ జియా (మలేసియా) చేతిలో, జయరామ్ 9-21, 6-21తో వితిద్ శరణ్ (థాయ్లాండ్) చేతిలో ఓడారు. మిక్స్డ్ క్వార్టర్స్లో సాత్విక్/అశ్విని జంట 17-21, 21-16, 18-21తో మలేసియా ద్వయం కియాన్/జింగ్ చేతిలో ఓడింది.
