మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి క్లాస్మేట్ను వేధించిన సైబర్ నేరగాడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. నాగర్కర్నూల్ జిల్లాకు కేంద్రానికి చెందిన మునగపాటి శివరామకృష్ట తనతో పాటు ఇంజనీరింగ్ చదివిన క్లాస్మేట్ ఫోన్నంబర్ సేకరించాడు. ఆమెతో పరిచయం పెంచుకుని వాట్సాప్ చాటింగ్ చేసేవాడు. ఓ రోజు ఆమె ఫొటో మార్ఫింగ్ చేసి అసభ్య ఫొటో పంపాడు. న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడకపోతే దానిని సోషల్మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. భయపడిన ఆమె అతడు చెప్పినట్లే చేసింది. అప్పుడు స్ర్కీన్షాట్లు తీసుకున్నాడు. వీడియో రికార్డు చేశాడు.

ఆ యువతి మరో యువకుడితో స్నేహంగా ఉండటం గమనించి నిలదీశాడు. ఆమె అతడంటే ఇష్టమని చెప్పింది. దీంతో శివరామకృష్ణ ఆమె ఫొటోలను సోషల్మీడియా గ్రూపుల్లో అప్లోడ్ చేశాడు. ఆమె సెల్నంబర్ను పోస్టు చేశాడు. దీంతో పలువురు ఫోన్ చేసి ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఆమె రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడు ఫోన్లో ఉన్న నగ్న చిత్రాలు, వీడియోలు డిలీట్ చేసి, పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసులు సాంకేతిక ఆధారంగా వీడియోలు, ఫొటోలు పోలీసులు తిరిగి రాబట్టడంతో నిందితుడు చేసిన తప్పు ఒప్పుకున్నాడు.
ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని..
అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించిన పోకిరీలపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సోషల్మీడియాలో ఉన్న అందమైన అమ్మాయిల ఫొటోలను డౌన్లోడ్ చేస్తున్న కొందరు వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తున్నారు. వాటిని తిరిగి వారికే వ్యక్తిగతంగా పోస్టు చేస్తున్నారు. తాము చెప్పినట్లు చేయాలని, లేకుంటే మార్ఫింగ్ ఫొటోలను సోషల్మీడియా, సైట్లలో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నగరానికి చెందిన ఓ బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.