అయోధ్యలో సెక్యూర్టీని పెంచారు. రేపు రామాలయ నిర్మాణం కోసం శంకుస్థాపన జరగనున్నది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక అన్ని రకాల పూజలు కూడా అయోధ్యలో ప్రారంభం అయ్యాయి. ఇవాళ రామజన్మభూమి ప్రాంతంలో రామార్చన పూజ నిర్వహించారు. భూమిపూజ వేడుకకు దేవతలను ఆహ్వానిస్తూ రామార్చన పూజ నిర్వహించారు. హనుమాన్గర్హి వద్ద కూడా ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో హనుమాన్గర్హి వద్ద నిషాన్ పూజ చేపట్టారు. హనుమాన్ గర్హి వద్ద నిషాన్ పూజను దాదాపు 1700 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న సంప్రదాయం ఉన్నది.
రామాలయ నిర్మాణం సందర్భంగా అయోధ్యలో వరుసగా మూడు రోజుల పూజలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ రెండవ రోజు. రామజన్మభూమిలో ఇవాళ వైదిక పద్ధతిలో వాస్తు శాంతి, శిలాసంస్కృతి, నవగ్రహ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు భూమిపూజ ప్రారంభంకానున్నది. ఆ కార్యక్రమం దాదాపు 10 నిమిషాలు ఉంటుందని పూజారులు చెప్పారు. భూమిపూజ కోసం అయోధ్య వస్తున్న ప్రధాని మోదీ ఆ నగరంలో సుమారు 3 గంటల పాటు గడపనున్నారు. ప్రధాని మోదీ అయోధ్యలో పారిజాత మొక్కను నాటనున్నారు. 48 హైటెక్ కెమెరాలతో భూమిపూజ ఈవెంట్ను లైవ్లో ఇవ్వనున్నారు. డీడీ, ఏఎన్ఐ కెమెరాలో దీంట్లో ఉన్నాయి.