బీసీ ల పట్ల వైసీపీ ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతొందని, సంక్షేమ శాఖల్లో ఉన్న అరకొర నిధులను కూడా నవరత్నాల పేరిట మల్లించడం అన్యాయమని అక్షేపణీయమని జాతీయ బీసీ జేఏసీ కన్వీనర్ వలిగట్ల రెడ్డెప్ప అన్నారు. ఎపిలో ఉన్నబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల ప్రజలను మభ్యపెట్టే విధంగా అధికార పార్టీ నేతల మాటలు, ప్రభుత్వ ప్రకటనలు ఉన్నాయని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా వెనుకబడిన కులాలను ఉద్ధరిస్తామన్నా ప్రభుత్వ ప్రకటనలు హాస్యాస్పదం అని, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నెలలు గడిచినా ఒక్క రూపాయి సాయం కూడా ఆయా సామాజికవర్గాలకు అందలేదని విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో వివిధ కార్పోరేషన్ల కింద తీసుకున్న స్వయం ఉపాధి ఋణాల దరఖాస్తులను కూడా బుట్టాదాకాలు చేసారని, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న ఒక్కరికి కూడా స్వయం ఉపాధి రుణాలు ఇచ్చిన పాపాన పోలేదని రెడ్డప్ప ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ల రిజర్వేషన్ల కు గండిపడితే అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం గాని, ప్రతి పక్షం గానీ చేయలేకపోవడం
దారుణమన్నారు. రాష్టంలో వెనుకబడిన కులాలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రక్షణ, భరోసా లేకుండా పోయాయన్నారు. ఎన్నికల తర్వాత పేదలు, మధ్యతరగతి, మైనార్టీల “అభిమాన” పార్టీగా చెప్పుకునే వైసీపీ అధికారంలోకి వచ్చిందని, ఇక సబ్సిడీ లోన్ సొమ్ము తమ అకౌంట్లలో పడుతుందని రెండు నెలలు ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలిందన్నారు. వెనుకబడిన కులాల సంక్షేమం విషయంలో చంద్రబాబు కంటే జగన్ బాగా చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూశరని, ప్రజల ఆశ నిరాశ అయిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖలలో ప్రస్తుతం ఒక్క స్కీమూ లేదూ, ఒక్క రూపాయీ లేదన్నారు.
పేరుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం పేరిట మంత్రి పదవులు, ఇవి కేవలం చెప్పుకోడానికి మాత్రమే. నాలుగు కార్లు, ఒక ఎస్కార్ట్ వాహనం వేసుకుని “కుయ్ కుయ్ కుయ్” మని తిరగడానికి తప్ప… వెనుకబడిన వారికి ప్రత్యేకంగా సంక్షేమం పేరిట చేసిందేమి లేదని ఆ ప్రకటనలో బీసీ జేఏసీ కన్వీనర్ విమర్శించారు. అందరికీ వర్తించే పథకాల్లో లబ్దిపొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు లబ్ధిదారుల సంఖ్యను చూపెట్టి ఇదే వెనుకబడిన సామాజిక వర్గాల సంక్షేమంటూ ప్రకటనలు ఇస్తూ వెనుకబడిన సామాజిక వర్గాల వారిని వెర్రి వెంగళప్పల్ని చేస్తున్నారన్నారు. అందిరికి ఇచ్చే పథకాల్లోనే సంక్షేమం అన్నప్పుడు ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు ఎందుకు? ప్రత్యేక కార్పొరేషన్లు ఎందుకు? వెంటనే మూసేయలన్నారు. వెనుకబడిన కులాలు, వెనుకబడిన తరగతుల ప్రజలు ఐక్యత చూపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.