భారత్లో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో మహమ్మారి మళ్లీ (సెకండ్ వేవ్) విరుచుకుపడుతోందని ఇది స్పష్టం చేస్తోంది. ఈ సెకండ్ వేవ్ 100 రోజులు ఉండే అవకాశం ఉంది. అంటే, మే నెలాఖరు వరకూ ఇది కొనసాగొచ్చు. ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 15 వచ్చే సరికి కేసులు గరిష్ఠ స్థాయికి చేరొ చ్చు. ఈసారి 25 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్సబీఐ) తాజా అధ్యయనంలో తేలింది. ఆ బ్యాంకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ దీన్ని రూపొందించారు. అయితే, ఆంక్షలు, లాక్డౌన్ల వల్ల ఉపయోగం లేదని, పెద్ద ఎత్తున టీకాలు వేయడం ద్వారా కరోనాను నిలువరించవచ్చని సూచించారు.

వారం రోజులుగా బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పతన దిశలో ఉందని, కొన్ని రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలు, లాక్డౌన్ల ప్రభావం వచ్చే నెలలో స్పష్టంగా కనిపిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం రోజూ 34లక్షల టీకాలు వేస్తున్నారని, దీన్ని 40-45 లక్షల టీకాలు వేసే స్థితికి తీసుకు రావాలని, అప్పుడు 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయాలంటే 4 నెలలు పడుతుందని విశ్లేషించారు. ప్రతి 100 మందికి టీకాలు వేసే వేగాన్ని గణనీయంగా పెంచాలని అభిప్రాయపడింది.
అధ్యయనంలోని మరిన్ని కీలక అంశాలు..
టాప్-15 జిల్లాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అవి కూడా పట్టణ ప్రాంతాల్లోనే.
రాజస్థాన్, గుజరాత్, కేరళ, ఉత్తరాఖండ్, హరియాణాల్లో తమ జనాభాలోని 20 శాతానికిపైగా వృద్ధులకు(60 ఏళ్లు పైబడి) టీకాలు వేశాయి.
60 ఏళ్లకుపైబడిన వృద్ధులు ఎక్కువగా ఉన్న పంజాబ్, తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, బెంగాల్ వంటి రాష్ట్రాలు తక్కువ శాతం వృద్ధులకే టీకాలు వేశాయి. ఆ రాష్ట్రాల్లో టీకాల వేగాన్ని పెంచాలి.
నెగెటివ్ అయితేనే బెంగళూరులోకి..
కరోనా కేసుల తీవ్రత మరోసారి పెరగడంతో కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరుకు వచ్చే వారందరికీ నెగెటివ్ రిపోర్టు ఉండాల్సిందేనని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ స్పష్టం చేశారు. కాగా, మనదేశం ఇప్పటిదాకా కానుకగా, వాణిజ్య ఒప్పందాల మేరకు, కొవాక్స్ కార్యక్రమానికి.. అన్నింటికీ కలిపి 80 దేశాలకు 6.4 కోట్ల డోసుల టీకాలను పంపింది. వచ్చే రెండు నెలల పాటు టీకాల ఎగుమతిని ప్రస్తుత పరిమితికి మించి పెంచే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మా అమ్మను రోడ్డు మీద వదిలేయండి!
ఆమెకు 70 ఏళ్లు. కరోనా వస్తే ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో దింపేసి వెళ్లిపోయారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆస్పత్రి సిబ్బంది బాధితురాలి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, ఆమెను ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. ప్రతిగా అవతలివైపు నుంచి వచ్చిన మాటలు విని ఆశ్చర్యపోయారు. తాము ఆమెను ఇంటికి తీసుకెళ్లలేమని, రోడ్డు మీదో, వీధుల్లోనో ఎక్కడైనా వదిలేయండి అని ఆమె కొడుకు చెప్పాడు. పుణెలో ఈ ఘటన జరిగింది. పోలీసుల సాయంతో వైద్య సిబ్బంది, బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లగా అప్పటికే కుటుంబసభ్యులు ఇంటికి తాళం వెసి వెళ్లిపోయారు. దీంతో మరుసటి రోజు కుటుంబసభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించడంతో వృద్ధురాలిని ఇంటికి తీసుకెళ్లేందుకు అంగీకరించారు.