ఇంకా ఫాస్టాగ్ కొనుగోలు చేయని వాహనదారులకు శుభవార్త! ఫాస్టాగ్లను ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఫాస్టాగ్ ధర రూ.100గా ఉంది. మార్చి 1వ తేదీ వరకు 770 టోల్ప్లాజాల వద్ద బ్యాంకులు ఉచితంగా ఫాస్టాగ్ను అందజేస్తాయి. బ్యాలెన్స్ రీచార్జి చేసుకుంటే సరిపోతుంది. ఫాస్టాగ్ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. కాగా.. ఈ నెల 16వ తేదీ నుంచి ఫాస్టాగ్ నిబంధన అమల్లోకి వచ్చింది. తొలి రెండు రోజుల్లో 87% వాహనాలు టోల్ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు జరిపాయని వెల్లడించింది.

60 లక్షల ట్రిప్పులకు ఫాస్టాగ్ ద్వారా రూ.95 కోట్ల మేర వసూళ్లు జరిగాయని పేర్కొంది. 100 టోల్ప్లాజాల వద్ద 90% వాహనాలు ఫాస్టాగ్తో వెళ్లాయని వివరించింది. మైఫాస్టాగ్ యాప్లో పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. వాహనం నంబరును నమోదు చేయగానే నగదు నిల్వల వివరా లు తెలుసుకోవచ్చని వివరించింది. నగదు నిల్వలు ఆకుపచ్చ, కాషాయం, ఎరుపు రంగుల్లో ఉంటాయని తెలిపింది. ఆకుపచ్చ రంగు ఉంటే తగినన్ని నిల్వలు ఉన్నాయని, కాషాయం రంగు ఉంటే నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఎరుపు రంగులో ఉంటే బ్లాక్లిస్టులో ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఫాస్టాగ్ ఆఫ్లైన్ రీచార్జ్ కోసం టోల్ప్లాజాల వద్ద 40వేల పాయింట్ ఆఫ్ సేల్స్(పీవోఎస్) యంత్రాలను అందుబాటులో పెట్టినట్లు వెల్లడించింది.