మొన్న కేరళ.. నిన్న మహారాష్ట్ర.. నేడు ఢిల్లీ..! ఒక్కో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనాను ఓడించినట్లు ఘనంగా ప్రకటించుకున్న దేశ రాజధానిలో వారం రోజుల వ్యవధిలోనే పరిస్థితి మారిపోయింది. తొమ్మిది నెలల అత్యల్ప సంఖ్యలో ఈ నెల 16న ఢిల్లీలో 94 కేసులు రాగా.. గత మూడు రోజుల నుంచి వైరస్ ఉధృతి పెరిగింది. బుధవారం 200, గురువారం 220, శుక్రవారం 256 మంది వైర్సకు గురయ్యారు. అంతా బాగుందని భావిస్తున్న ప్రజలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని,తాజా పరిణామాలు ప్రమా ద ఘంటికేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా వైర్సకు గురైనవారిలో ఎక్కువ శాతం ప్రయాణ చరిత్ర ఉన్నవారేనని, పెళ్లిళ్లు, సామూహిక కార్యక్రమాలకు హాజరైనవారేనని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో కేసులు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. కాగా, ఢిల్లీలో గురువారం ఒక్కరూ చనిపోలేదు. దేశంలో వరుసగా రెండో రోజు కొత్త కేసులు 16 వేలపైగా నమోదయ్యాయి. గురువారం 16,577 మందికి వైరస్ నిర్ధారణ అయింది. 120 మంది చనిపోయారని, 12,179 మంది కోలుకున్నారని కేంద్రం ప్రకటించింది. లక్షద్వీ్పలో తొలి మరణం నమోదైనట్లు పేర్కొంది. మహారాష్ట్రలో మళ్లీ 8 వేల పైగా పాజిటివ్లు వచ్చాయి.

కేరళలో 3,677, పంజాబ్లో 563 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసులు 1.56 లక్షలకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ (611) సహా 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు వెయ్యిలోపే ఉన్నట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఏపీ, ఢిల్లీ సహా 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎవరూ చనిపోలేదని వివరించింది. కొత్తగా టీకా తీసుకున్న 8 లక్షల మందితో కలిపి శుక్రవారం ఉదయం నాటికి 1.34 కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. వీరిలో 66.21 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు తొలి డోసు, 20.32 లక్షల మందికి రెండో డోసు, 48.18 లక్షల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు తొలి డోసు వేసినట్లు పేర్కొంది. తెలంగాణ, తమిళనాడు సహా 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాం తాల్లో వ్యాక్సినేషన్ 60 శాతంలోపే ఉందని తెలిపింది. వివిధ దేశాలకు 3.61 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వివరించింది. ఇందులో 67 లక్షల డోసులు ఉచితంగా ఇచ్చినట్లు పేర్కొంది. 60 పైగా దేశాలకు టీకా సరఫరా చేస్తూ.. టీకా అందరికీ అందేలా భారత ప్రధాని నరేంద్ర మోదీ చూపిన చొరవను డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ ఘెబ్రెయెసస్ ప్రశంసించారు. ప్రస్తు తంఉన్న కొవిడ్ నియం త్రణ మార్గదర్శకాలు మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేం ద్రం ప్రకటించింది. ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్థ్యంలో సినిమా హాళ్ల నిర్వహణకు అనుమతి ఉండగా.. దీనిని మరింత పెంచే అవకాశం ఉంది. ఈత కొలనుల్లో ఇప్పటివరకు క్రీడాకారులకే అనుమతి ఉండగా, ఇకపై అందరికీ ప్రవేశం ఇవ్వనున్నారు.
మార్చి 1 నుంచి 60 ఏళ్ల పైబడినవారు, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాల వ్యాధులున్నవారికి టీకా ఇచ్చే క్రమంలో.. కొవిన్ సాఫ్ట్వేర్ను 1.0 నుంచి 2.0కు అప్డేట్ చేస్తున్నందున శని, ఆదివారాల్లో దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం ఉండదని కేంద్రం తెలిపింది. లబ్ధిదారులు సోమవారం నుంచి కొవిన్లో నమోదు చేసుకోవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొవిన్ కొత్త వెర్షన్ ద్వారా లబ్ధిదారులు టీకా కేంద్రాలను ఎంచుకోవచ్చని వివరించాయి.
ప్రపంచ మరణాలు 25 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 25 లక్షలు దాటాయి. అమెరికా (5.20 లక్షలు) ఐదో వంతు ఉండగా.. బ్రెజిల్లో శుక్రవారంతో మరణాలు 2.50 లక్షలను మించాయి. మెక్సిలో 1.83 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 1.57 లక్షల మరణాలతో భారత్ నాలుగో స్థానంలో ఉంది. కాగా, మొత్తం 25 లక్షల మరణాల్లో 11 లక్షలు ఈ నాలుగు దేశాల్లో ఉండటం గమనార్హం. ఇవికాక యునైటెడ్ కింగ్డమ్ (1.20 లక్షలు)లో లక్షపైగా మరణాలు సంభించాయి. చైనా తయారీ కొవిడ్ వ్యాక్సిన్ సైనోఫామ్ను వాడకూడదని శ్రీలంక నిర్ణయించింది. ఆ స్థానంలో భారత్లోని సీరం ఇన్స్టిట్యూట్లో తయారవుతున్న ఆస్ట్రాజెనెకా వాక్సిన్ను వినియోగంలోకి తేవాలని భావిస్తోంది. ఈ క్రమంలో.. కోటి డోసుల కోసం సీరం ఇన్స్టిట్యూట్తో శ్రీలంక ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 388 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది.
పిల్లల ఆరోగ్యం, చదువుపై కరోనా ఘంటిక
కరోనా మహమ్మారి మిగిల్చిన పెను ప్రభావం ప్రపంచ దేశాలను ఏళ్ల తరబడి వెంటాడనుంది. చిన్నారుల ఆరోగ్యం, చదువుపై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో నవజాత శిశువుల నుంచి 14ఏళ్ల లోపు 37.5 కోట్ల పిల్లలపై తీవ్ర ప్రభావం ఉంటుందని శాస్త్రీయ, పర్యావరణ కేంద్రం హెచ్చరించింది. సదరు పిల్లలకు రోగనిరోధక శక్తి లోపించి మరణాలకూ దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల మంది పిల్లలు స్కూళ్లకు దూరమయ్యే పరిస్థితి ఉంది. వీరిలో సగం మందికి పైగా మన దేశంలోనే ఉంటారని తెలిపింది.