- కోట్లు వెచ్చించి కొన్న వజ్ర బస్సులు తుక్కుగా మారనున్నాయి. వీటిని వినియోగించడం సాధ్యం కానందున పూర్తిగా వదిలించుకోవాలని టీఎ్సఆర్టీసీ నిర్ణయించింది. స్ర్కాప్ పాలసీ కింద మినీ బస్సులను తుక్కుగా మార్చాలని అంతర్గత ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఫలితంగా ఒక్కోటి రూ.70 లక్షల చొప్పున రూ.40 కోట్లకుపైగా నిధులు వెచ్చించి కొన్న బస్సులు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో 2017లో 60 వజ్ర మినీ ఏసీ బస్సులను సంస్థ కొనుగోలు చేసింది. సెంట్రల్ ఏసీతో కూడిన ఒక్కో బస్సుకు అప్పట్లోనే రూ.70లక్షలు వెచ్చించింది.

హైదరాబాద్లోని మెహిదీపట్నం, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ వంటి ప్రధాన కాలనీల నుంచి వివిధ నగరాలకు ప్రయాణికులను చేరవేసేందుకు వజ్ర బస్సులను వినియోగించింది. కేవలం ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఉండడం, చార్జీలు అధికంగా ఉండడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ బస్సులు కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) కూడా సాధించలేకపోయాయి. ఇక, లాక్డౌన్ తర్వాత అన్ని బస్సులను దశలవారీగా రోడ్లపైకి తెచ్చిన ఆర్టీసీ.. వజ్ర బస్సులను మాత్రం బయటకు తీయలేదు. ఎక్కడికక్కడ షెడ్లకే పరిమితం చేసింది. వీటికి కనీస మెయింటెనెన్స్ చర్యలు సైతం చేపట్టకపోవడంతో తుప్పు పట్టిపోయాయి. మినీబస్సులను ఉద్దేశపూర్వకంగానే గాలికొదిలేశారన్న విమర్శలు ఉండగా.. ఎలాగూ పనికిరాకుండా పోయినందున తుక్కుగా మార్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.