
నివాస గృహాల మార్కెట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. గత ఏడాది అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో హైదరాబాద్లో ఇళ్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఆ త్రైమాసికంలో స్థిరాస్థి రంగంలో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 122 స్థానం దక్కించుకుంది. 2020 త్రైమాసికంలో గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ కు సంబంధించి నైట్ ఫ్రాంక్ సంస్థ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ జాబితాలో హైదరాబాద్ తర్వాత బెంగళూరుకు 129 స్థానం రాగా, అహ్మదాబాద్ (143), ముంబై (144), ఢిల్లీ (146), కోల్కతా (147), పుణె (148) స్థానాల్లో నిలిచాయి. 150 ర్యాంక్తో చెన్నైఅట్టడుగు స్థానంలో నిలిచింది.
‘‘ ప్రపంచవ్యాప్తంగా నివాసస్థలాల ధరలు 2020 త్రైమాసికంలో పెరిగిన దేశంలో ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. 2019 ఏడాదితో పోల్చుకుంటే ఇళ్ల ధరల పెరుగుదల వృద్ధి రేటు 0.2 శాతంగా ఉంది’’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. దేశంలో ఇతర నగరాల్లో ఇళ్ల ధరలు తగ్గుముఖంపడుతుంటే ….హైదరాబాద్ మాత్రం స్థిరాస్థి రంగం ప్రగతిపథంలో దూసుకుపోవడం విశేషం. బెంగళూరులో ఇళ్లధరలు 0.8 శాతం తగ్గగా, అహ్మదాబాద్లో 3.1 శాతం, ముంబై 3.2 శాతం, ఢిల్లీ 3.9, కోల్కతా 4.3, పుణె 5.3 శాతంమేర ధరలు పడిపోయాయని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలోనూ హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ ఊపును కొనసాగించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బజాజ్ ప్రశంసించారు. గత ఏడాదిలోని (2020) అన్ని త్రైమాసికంలోనూ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుదల కొనసాగుతునే ఉన్నాయని ఆయన అన్నారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ను స్వర్గధామంగా భావించడమే దీనికి కారణమని నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అభిప్రాయపడ్డారు.
‘‘దేశంలోని స్థిరాస్థి మార్కెట్ రంగం గత మూడు త్రైమాసికంలో బాగా పుంజుకుంది. కొవిడ్ కారణంగా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని ప్రజలు భావించడం, ఇళ్ల ధరలు కొద్దిగా తగ్గడం, ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడమే దీనికి కారణం. స్టాంప్ డ్యూటీలు తగ్గించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంలాంటి చర్యల వల్ల కూడా కొవిడ్కన్నా ముందున్ననాటి పరిస్థితులు ఈ రంగంలో నెలకొన్నాయి’’ అని బజాజ్ పేర్కొన్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా అంకారా (టర్కీ) రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇక్కడ ఇళ్ల ధరలు రేట్ల పెరుగుదల ఏటా రూ. 30.2 శాతంగా ఉన్నట్టు నైట్ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. 29.4 శాతం పెరుగుదలతో టర్కీలోని ఇజ్మిర్ నగరంలో రెండో స్థానంలో, ఇస్తాన్ బుల్లో మూడో స్థానంలో నిలిచాయి.