హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా (యూటీ) చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంఐఎం, టీఆర్ఎస్ అబద్ధాలు చెబుతున్నాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ను యూటీగా మార్చే ప్రమాదం ఉందంటూ లోక్సభలో ప్రస్తావించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్.. తాము సమాధానం చెప్పేలోపే వెళ్లిపోయారని ఆయన విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భాగ్యనగర్, గోల్కొండ జిల్లాల నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో తమ అభ్యర్థి రాంచందర్రావు మళ్లీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని మజ్లి్సతో కలిసి కైవసం చేసుకోవడంపై ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేవలం కమీషన్లు వచ్చే పనులు తప్ప ఏ అభివృద్ధీ జరగలేదని పేర్కొన్నారు.

మండలిలో ప్రజా గొంతుక వినిపించే రామచందర్రావు గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. సీఎం పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ మజ్లిస్ అధినేత, ఎంపీ అసద్కు పిచ్చిపట్టిందని అన్నారు. అభివృద్ధి గురించి కాకుండా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, వివేక్, ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్రావు, జిల్లా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.