
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హూం మంత్రి అమిత్ షా, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. మునగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనటానికి తెలంగాణకు వచ్చిన అమిత్ షా ఇద్దరు ప్రముఖులతో ఒకేసారి కలవడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని తెలుస్తోంది. రెండు వారాల కిందట ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం అయిన నేపథ్యంలో అమిత్ షా, రామోజీరావు కలయిన హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీ కీలక నేత కేంద్ర హూం మంత్రి అమిత్ షా, ప్రముఖ మీడియా సంస్థల అధినేత రామోజీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. మునగోడు ఉప ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన అమిత్ షా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పావులు కదిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 36 లక్షల మంది సెటిలర్లు ఉన్నారు. వీరంతా టీడీపీ సానుభూతి పరులే. ఏపీలో వైసీపీతో అంటకాగి రాజధాని కూడా లేకుండా చేసిన బీజేపీపై సెటిలర్లు గుర్రుగా ఉన్నారు. సెటిలర్లకు దగ్గరయ్యేందుకు బీజేపీ నేతలు టీడీపీతో జత కట్టేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ముందుగా తెలంగాణలో టీడీపీ సహాయం పొందేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా రంగంలోకి దిగారు. ఇందుకు రామోజీతో సమావేశం అయ్యారు. ఆయన సలహాలు తీసుకున్నారు. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ బీజేపీ కలసి పని చేసేందుకు అవసరమైన గ్రైండ్ సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది.
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ కూడా రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు ముగ్దుడైన అమిత్ షా మర్యాద పూర్వకంగా కలిశారని చెబుతున్నా…నమ్మశక్యంగా లేదు. తెలంగాణలో టీడీపీ ప్రతినిధిగా జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలని బీజేపీ యోచిస్తోంది. ఎన్టీఆర్ సహకారంతో బీజేపీ నేతలు కేసీఆర్ ను ఎదుర్కోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే మీడియా సహకారం కోసం రామోజీరావును, గ్రైండ్ లెవల్లో ప్రజల్లోమాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ సహకారం తీసుకోవడానికి బీజేపీ ముందడుగు వేసింది. బీజేపీలో అగ్రనేతగా ఉన్న అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ తో 45 నిమిషాలు చర్చించారంటే తెలంగాణపై వారి ఫోకస్ అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఢిల్లీలో మోడీని కలిసిన తరవాతే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోవడం వారి బేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలో ప్రధాని మోడీని ఇటీవల చంద్రబాబు కలిసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి తరచూ రావాలని చంద్రబాబుకు మోడీ సూచించారు. తెలంగాణలో మరో ఏడాదిలో ఎన్నికలు, కొద్ది రోజుల్లో మునగోడు ఉప ఎన్నికలు ఉండటంతో ఇక టీడీపీ సహకారం కోసం బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణలో టీడీపీ కూడా సింగిల్ గా బరిలో దిగే అవకాశాలు లేవు. అందుకే ఉభయతారకంగా తెలంగాణలో టీడీపీ బీజేపీ కలసి కేసీఆర్ ను ఎదుర్కోవాలని అమిత్ షా స్కెచ్ వేశారు. ఇందుకు చంద్రబాబు సహకారం కూడా తోడు కోవడంతో అమిత్ షా రంగంలోకి దిగారు. తెలంగాణలో బీజేపీకి టీడీపీ సహకారం అందించేందుకు సిద్దంగా ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమిత్ షా రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్ లతో సమావేశం అయ్యారనే విషయం స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా మునగోడు ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని చెప్పవచ్చు.