రాష్ట్రంలో నోటి కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి.

అదే సమయంలో రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార కేన్సర్లు కొద్దిగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము కేన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుండగా, మన దేశంలో మాత్రం నోటి కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఏటా ఫిబ్రవరి 4ను ‘వరల్డ్ కేన్సర్ డే’గా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ‘‘నేను-నేను సాధించగలను’’ అనే నినాదంతో ఈ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కలిగించేలా జరుపుకొవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా పిలుపునిచ్చింది.
ఎంఎన్జే ఆస్పత్రిలో..
కేన్సర్ కేసులు పెరుగుతోన్న దాన్ని జయిస్తున్నారు వారు కూడా ఉన్నారు. ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రిలో ఏటా వేల సంఖ్యలో కేన్సర్ రోగులు చికిత్స కోసం వస్తుంటారు. వచ్చే ప్రతి 100 మంది రోగుల్లో 48.9 శాతం మంది కేన్సర్ను జయిస్తున్నట్లు ఎంఎన్జే ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు. మిగిలిన కేసులన్ని కూడా కేన్సర్ చివరి దశలో వస్తుండటంతో వ్యాధిని నయం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం కేన్సర్కు వస్తున్న అత్యాధునిక చికిత్సతో పాటు, రోగి జీవనశైలి వల్ల అది సాధ్యం అవుతుందని కేన్సర్ వైద్యనిపుణులు చెబుతున్నారు. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే కేన్సర్ ఏ దశలో ఉందో తెలుస్తుంది. ఆ వెంటనే చికిత్సను తీసుకోవడం ద్వారా వ్యాధి ముదిరిపోకుండా అడ్డుకట్ట వేయొచ్చు.
ఈ లక్షణాలుంటే..
నోటిలో ఎంతకూ మానని పుండు ఉంటే దాన్ని నోటి కేన్సర్గా అనుమానించాలి.
నోట్లో ఎర్రటి, తెల్లటి మచ్చలు కనిపిస్తే జాగ్రత్తపడాలి.
నోటిలో ఏమైనా తేడా ఉంటే అనుమానించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
బ్రష్ చేసే సమయంలో రక్తం వచ్చినా అనుమానించాలి.
మెడ ప్రాంతంలో గడ్డలు కనిపిస్తే ఓరల్ కేన్సర్కు కారణం కావచ్చు.
ఎక్కువగా పొగాకు తాగడం, నమలడం, ఏదో ఒక రూపంలో దాన్ని తీసుకునేవారు, నిత్యం ఆల్కహాలు తీసుకునేవారు ఎక్కువగా నోటి కేన్సర్కు గురయ్యే అవకాశాలున్నాయి.
కళ్లు తెరిపించే వాస్తవాలు..
ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కేన్సర్
కారణంగా చోటుచేసుకుంటోంది.
కేన్సర్తో మృతిచెందుతున్న వారిలో 22% మంది పొగాకును వివిధ రూపాల్లో వాడుతున్న వారే.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి సగటున 17 మంది కేన్సర్తో చనిపోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కేన్సర్తో మృతిచెందుతున్న వారిలో ఆరుశాతం మంది భారతీయులే.
ముందస్తుగా గుర్తిస్తే మేలు
ప్రస్తుతం మన జీవన విధానం వల్ల కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు పొగాకు వాడకంపై నిషేధాలు పెట్టినప్పటికి ఏదో ఒక రూపంలో అవి దొరుకుతున్నాయి. దాంతో నోటి కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
కేన్సర్ వస్తే జీవితం ఆగిపోదు
ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా కేన్సర్ బారినపడకుండా ఉండొచ్చు. ఽధూమ, మద్యపానాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ కేన్సర్ సోకితే జీవితం అంతటితో ముగిసిపోదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
కేన్సర్ చికిత్స మరింత సులువు
కేన్సర్ చికిత్స ఇప్పుడు మరింత సులువైంది. తక్కువ నొప్పితో శస్త్రచికిత్స చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అలాగే కేన్సర్ కణితిని బట్టి తక్కువ సైడ్ ఎఫెక్టు ఉండే మందులు ఇస్తున్నారు
రాష్ట్రంలో ఏటా..
తెలంగాణలోని ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రిలో 2020 జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్యకాలంలో దాదాపు 10వేల కొత్త కేన్సర్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 22 శాతం మంది నోటి కేన్సర్ రోగులు ఉండగా, 15 శాతం మంది రొమ్ము కేన్సర్, 14 శాతం సర్వైకల్ కేన్సర్ రోగులను గుర్తించినట్లు ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ జయలత తెలిపారు. గతేడాది నోటి కేన్సర్ రోగుల సంఖ్య పెరిగిందని ఆమె వివరించారు. తెలంగాణకు చెందిన గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ 2013నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5 లక్షల మందికి స్ర్కీనింగ్ నిర్వహించగా, కేన్సర్ పాజిటివ్ రేటు 1.7శాతం ఉన్నట్లు వెల్లడైంది. ఇక ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం ఏటా రాష్ట్రంలో కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో గత సంవత్సర కాలంలో 13.58 లక్షల మంది కేన్సర్ బారినపడగా, 7.50 లక్షల మంది చనిపోయారు.
నోటి కేన్సర్ వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే పరీక్షలు చేయించుకోవాల్సిందే. కానీ ఆ అవసరం లేకుండా ఒక యాప్ ద్వారా ఓరల్ కేన్సర్ను గుర్తించే పరిజ్ఞానం త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఐఐటీ హైదరాబాద్, గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్లు సంయుక్తంగా గత మూడు నెలలుగా ఈ యాప్ అభివృద్ధికి కసరత్తు చేస్తున్నాయి. వీలైనంత త్వరగా దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అవిశ్రాంతగా పరిశోధన చేస్తున్నాయి. ఓరల్ కేన్సర్ అనుమానితులు తమ నోటి ఫొటోను తీసి ఈ యాప్లో అప్లోడ్ చేస్తే చాలు. కొన్ని క్షణాల్లోనే కేన్సర్ రిస్కు ఉందా లేదా అని తెలిసిపోతుంది. నోటిలో ఎర్ర, తెల్లమచ్చలు ఉంటే వాటి ఆధారంగా కేన్సర్ ముప్పు ఏ మేరకు ఉందనేది కూడా వెల్లడవుతుంది. నోటి పరిస్థితి ఆధారంగా వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలా, వద్దా అనే విషయం కూడా ఈ యాప్ సూచిస్తుందని గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చినబాబు తెలిపారు.