హైదరాబాద్ : మేయర్ ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు ప్రవేశ ద్వారాల వద్ద పోలీసులు రాకపోకలను పరిశీలించనున్నారు. కార్యాలయ ఆవరణలోకి ఏ వాహనాలనూ అనుమతించవద్దని నిర్ణయించారు. బారికేడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే లోనికి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల అథారిటీ జారీ చేసిన పాస్లు ఉన్న మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి. బుధవారమే కొందరు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఆఫీస్ వద్ద బారికేడింగ్ ఏర్పాటును పరిశీలించారు.

ప్రధాన కార్యాలయానికి సెలవు
ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి నేడు సెలవు ప్రకటించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎలక్షన్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ విభాగం, సీపీఆర్ఓ సెక్షన్ల అధికారులు, ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి రానున్నారు. ఎన్నికల విధులు కేటాయించని ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగులు ఆఫీ్సకు రావాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో అధికారిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.