తమిళనాడులో ఘోరం సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి 11 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 20 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని అచ్చంకుళంలోని ‘మరియమ్మాళ్ ఫైర్ వర్క్స్’ కర్మాగారంలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు వందమంది కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం యథావిధిగా పనుల్లో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తారాజువ్వలు తయారు చేసే గది లో మందుగుండు దట్టిస్తుండగా హఠాత్తుగా నిప్పురవ్వలు చెలరేగాయి. ఆ నిప్పురవ్వలు అదే గదిలో పేర్చి ఉన్న టపాసులపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆ టపాసులన్నీ పేలాయి. ఈ క్రమంలో మంటలు కూడా రాజుకున్నాయి. ఇవి పక్కనే ఉన్న మరో నాలుగు గదులకూ వ్యాపించడంతో అక్కడ నిల్వ ఉంచిన బాణసంచా కూడా పేలిపోయింది.
ఈ పేలుడు ధాటికి నిముషాల వ్యవధిలో కర్మాగారం మొత్తం నేలమట్టమైంది. ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు కార్మికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొంతమంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పేలుడు కారణంగా కుప్పకూలిన గోడల శిథిలాల కింద చిక్కుకుని మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంద రు మాత్రం కాలి, రక్త మోడుతున్న శరీరాలతో దూరంగా వచ్చిపడ్డారు. ఈ దుర్ఘటనలో ఓ మహిళతో పాటు 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఆరుగురు సాత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. 70 శాతానికి పైగా కాలిన గాయాలతో సుమారు 20 మంది చికిత్సపొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పేలుడు ఘటన పట్ల ప్రధాని నరేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశా రు. తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభు త్వం 3 లక్షల చొప్పున, ప్రధాని మోదీ 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, గత పదేళ్లలో శివకాశి, సాత్తూరు తదితర ప్రాం తాల్లో బాణసంచా పేలుళ్ల వల్ల 400 మంది వరకు మృతి చెందినట్లు అంచనా.