న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను ఆదివారం విడుదల చేసింది. సెప్టెంబరు 7 నుంచి వినియోగదారులకు ఈ ప్యాక్లు అందుబాటులోకి వస్తాయి. దీనిలో భాగంగా రూ.499కే అన్లిమిటెడ్ డేటా, టీవీ ఛానెళ్లు, ఓటీటీ యాప్స్ అన్నింటినీ ఇస్తోంది. ఈ బండిల్ ఆఫర్లో 550టీవీ ఛానెళ్లు, డిస్నీ ప్లస్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ యాప్లో 10వేలపైగా సినిమాలు, షోలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.
ఈ బండిల్లో భాగంగా మొత్తం ఐదు రీచార్జ్ ఆఫర్లను ఎయిర్టెల్ విడుదల చేసింది. వీటన్నింటిలో పైన చెప్పిన అన్ని సౌకర్యాలూ ఉంటాయి. అంటే 550టీవీ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, అన్లిమిటెడ్ డేటా, 10వేలపైగా సినిమాలూ, కార్యక్రమాలూ అన్ని వస్తాయి. రూ.499 రీచార్జ్ చేసుకుంటే 40ఎంబీపీఎస్ డేటా స్పీడ్ వస్తుంది. అదే రూ.799తో రీచార్జ్ చేయించుకుంటే 100ఎంబీపీఎస్, రూ.999 ప్యాక్లో 200ఎంబీపీఎస్, రూ.1499ప్యాక్తో 300ఎంబీపీఎస్, రూ.3999 ప్యాకేజీలో 1జీబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ 4కే టీవీ బాక్స్ వినియోగదారులకు ఈ ఆఫర్లను ప్రకటించారు. ఆండ్రాయిడ్ 9.0తో పనిచేసే ఈ బాక్సు ధర రూ.3999. అలాగే దీని రిమోట్.. గూగుల్ వాయిస్ సెర్చ్ను సపోర్ట్ చేస్తుంది.