ఫ్యూచర్స్ గ్రూప్ సీఈఓ కిశోర్ బియానీపై సెబీ ఏడాది పాటు వేటు వేసింది.

2017 మార్చి-ఏప్రిల్ నెలల మధ్య కాలంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారన్న అభియోగాల కారణంగా ఏడాది పాటు సెక్యూరిటీ మార్కెట్ లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించింది. అలాగే ఫ్యూచర్ రిటైల్కు చెందిన షేర్ల కొనుగోలు, విక్రయం వంటి లావాదేవీలు రెండేళ్ల పాటు నిర్వహించకుండా బియానీ, ఆయనకు సంబంధం ఉన్న మరో నాలుగు కంపెనీలను నిషేధించింది.
ఒక డీమెర్జర్ లావాదేవీ సమాచారాన్ని రహస్యంగా ఉంచి ఆ ప్రక్రియ చేపట్టడానికి ముందస్తుగా నిర్వహించిన లావాదేవీ నుంచి సంపాదించిన లాభం రూ.20 కోట్లు తిరిగి చెల్లించాలని బియానీని, ఆయనకు సంబంధం ఉన్న మూడు కంపెనీలను సెబీ ఆదేశించింది. బియానీలు ఈ లావాదేవీల కోసం ఫ్యూచర్ కార్పొరేట్ రీసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ప్రత్యేక ట్రేడింగ్ అకౌంట్ తెరిచి డీమెర్జర్ నిర్ణయం ప్రకటించడం కన్నా ముందుగానే ఫ్యూచర్ రిటైల్ షేర్ల ట్రేడింగ్ నిర్వహించినట్టు దర్యాప్తులో తేలిందని సెబీ తెలిపింది.
వారు పాల్పడిన ఉల్లంఘనలు అత్యంత తీవ్రమైనవిగా పరిగణిస్తున్నానని, అందుకు ట్రేడింగ్ నిషేధం విధించడంతో పాటు అక్రమంగా సంపాదించిన లాభాన్ని తిరిగి వసూలు చేయాలని నిర్ణయించానని సెబీ హోల్టైమ్ డైరెక్టర్ అనంత బారువా ఆ ఆదేశంలో స్పష్టం చేశారు.