బీమా కంపెనీలు తమ కస్టమర్లకు వచ్చే ఏప్రిల్ నాటికి ‘సరళ్ సురక్ష‘ పేరిట ప్రామాణిక ప్రమాద బీమా పాలసీలు అందుబాటులోకి తేవాలని సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ సూచించింది. ప్రస్తుతం మార్కెట్లో పలు ప్రమాద బీమా పాలసీలున్నాయని, వాటి లక్షణాలు విభిన్నంగా ఉండడం వల్ల ఏది ఎంపిక చేసుకోవాలనే విషయంలో గందరగోళ పరిస్థితి ఉందని పేర్కొంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకే రకమైన పదజాలంతో తేలిగ్గా అర్ధం అయ్యే విధంగా ప్రామాణిక ప్రమాద బీమా పాలసీలు ప్రవేశపెట్టాల్సిన అవసరముందని తెలిపింది. సరళ్ సురక్ష పేరుతో బీమా కంపెనీ పేరును కలిపి ఈ పాలసీలు అమల్లోకి తేవాలని, ఇతర పేర్లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వీటికి కనిష్ఠంగా రూ.2.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.కోటి వరకు కవరేజీఇవ్వాలని తెలిపింది.
