బడ్జెట్లో మౌలిక సదుపాయాల రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం సిమెంట్ పరిశ్రమపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది.

బడ్జెట్లో ప్రకటించిన నిర్ణయాలతో పాటు నిర్మాణ పనులు ఊపందుకోనున్నందున సిమెంట్ గిరాకీ పెరగనుందని పరిశ్రమ వర్గాలం టున్నాయి. భారత్మాలా పరియోజన ప్రాజెక్టు కింద రూ.3.3 లక్షల కోట్ల విలువైన 13,000 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులను ఇప్పటికే అప్పగించారు. ఇందులో 3,800 కిలోమీటర్ల రహదారులు పూర్తయ్యాయి. 2022 మార్చి నాటికి మరో 8,500 కిలో మీటర్ల రహదారి పనులను అప్పగించనున్నారు. తమిళనాడు,. కేరళ తదితర రాష్ట్రాల్లో చేపట్టనున్న హైవే పనులు సిమెంట్ డిమాండ్ను ఆకర్షణీయంగా పెంచనున్నాయని వారంటున్నారు. మౌలిక సదుపాయాలతో పాటు మెట్రో రైల్, విజయవాడ-ఖరగ్పూర్ వంటి ఫ్రైట్ కారిడార్ల అభివృద్ధి కారణంగా సిమెంట్ గిరాకీ పెరగనుందని దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం (ఎస్ఐసీఎంఏ) పేర్కొంది.
దక్షిణాది సిమెంట్ తయారీదారులు చేసిన వివిధ విన్నపాలను ఆర్థిక మంత్రి పరిగణనలోకి తీసుకున్నారని, బడ్జెట్పై హర్షం వ్యక్తం చేస్తున్నామని ఎస్ఐసీఎంఏ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసన్ తెలిపారు. రియల్టీ, అఫర్డ్బుల్ గృహాలను ప్రోత్సహించడానికి ప్రకటించిన నిర్ణయాలు కూడా సిమెంట్ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపనున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే 2021-22 ఏడాదికి సిమెంట్ గిరాకీ 10-11 శాతం వరకు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రవాణాకు రాయితీలివ్వండి: దక్షిణాది రాష్ట్రాల్లో సిమెం ట్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 19 కోట్ల టన్నులు ఉంటే.. గిరాకీ మాత్రం 7 కోట్ల టన్నులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రహదారులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రత్యేక రకం సిమెంట్ అవసరమవుతుందని వాణిజ్య, రైల్వే మంత్రికి ఇప్పటికే సిమెంట్ తయారీదారుల సంఘం వినతి పత్రం సమర్పించింది. కేంద్ర, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సిమెంట్ సరఫరా చేయడానికి దక్షిణాది సిమెంట్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే రాయితీలపై సిమెంట్ రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి.
సామర్థ్యాల వినియోగం పెరుగుతుంది: ఐదు లక్షల డాలర్ల మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చిందని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ (రవాణా, పట్టణ మౌలిక సదుపాయాలు) బీవీఎన్ రావు తెలిపారు. సిమెంట్, ఉక్కు వంటి రంగాల్లో గిరాకీ పుంజుకుంటుందని, సామర్థ్యాల వినియోగం పెరుగుతుందన్నారు.