ఉస్మానియా వర్సిటీలో మీరు డిగ్రీ ఫెయిల్ అయ్యారా? ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యల కారణంగానో నిర్ణీత గడువులోపు బ్యాక్లాగ్స్ పూర్తి చేయలేకపోయారా? ఇది జరిగి ఏళ్లు గడుస్తోందా? మళ్లీ డిగ్రీ పూర్తి చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇందుకు రీ అడ్మిషన్ తీసుకొని మళ్లీ చదవాల్సిన పనిలేదు. అప్పట్లో మీకు మిగిలిన బ్యాక్లాక్స్ను పూర్తిచేస్తే చాలు! ఈ మేరకు అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాల యం ‘వన్టైం చాన్స్’ను తీసుకొచ్చింది. బ్యాక్లాగ్లు మిగిలిపోయి పదేళ్లు కాదు.. 30ఏళ్లు, ఆపైనే అయినా ఆ విద్యార్థులకు పరీక్ష రాసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీకాలేజీల విద్యార్థులతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాడు ఓయూ అనుబంధంగా కొనసాగిన ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదివిన విద్యార్థుల కు ఇది గొప్ప అవకాశంగా మారింది. వన్టైమ్ చాన్స్లో భాగంగా ఓయూ పరిధిలో బీఏ, బీకాం, బీఏస్సీ, బీఎ్సడబ్ల్యూ, బీబీఏ చదివిన విద్యార్థులు కొన్నేళ్లుగా ఉన్న మొదటి, రెండో, మూడో సంవత్సర బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవచ్చు.

ఇందుకుగాను దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 15 వరకు గడువు విధించారు. ఈ మేరకు 2002-2012 మధ్య విద్యార్థులయితే సబ్జెక్టుకు రూ.6వేలతో పాటు రెండు పేపర్ల వరకు అదనంగా రూ.710, మూడు పేపర్లు, ఆ పైనా ఉంటే అదనంగా రూ.1010 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 1988-2002 మధ్య విద్యార్థులైతే సబ్జెక్టుకు రూ.10వేలు చెల్లిం చాల్సి ఉంటుంది. రూ.200ల ఆలస్య రుసుంతో మార్చి 19 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. పరీక్షలు ఏప్రిల్ నెలో నిర్వహించనున్నారు. వివరాలకు వర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచీలో సంప్రదించాలని, వివరాలు వర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. అయితే బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు వన్టైం చాన్స్ ఇచ్చినా పరీక్ష ఫీజులు భారీ స్థాయిలో నిర్ణయించారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఓ విద్యార్థి కోర్టు మెట్లు ఎక్కిన్నట్లు సమాచారం. దీనిపై వర్సిటీ అకడమిక్ సెనేట్ స్టాండింగ్ కమిటీ కూడా తగు విధానపరమైన నిర్ణయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. కాగా విద్యార్థులు బ్యాక్లాగ్స్ ఫీజులు చెల్లించిన తర్వాత ప్రతికూల ఆదేశాలు కోర్టు నుంచి వస్తే విద్యార్థులకు ఆ మేరకు తిరిగి చెల్లింపులు చేస్తామని వర్సిటీకి చెందిన అధికారులు తెలిపారు.