‘‘టీఆర్ఎ్సలో నేను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్నాను. పార్టీలో నిన్న మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చినా ఎలాంటి గొడవ పడలేదు. సీఎం కేసీఆర్.. కార్యకర్తలు, నేతలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతారు’’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామలో గురువారం మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘టీఆర్ఎ్సలో కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యాన్ని కల్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే వేదం. కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి’’ అని చెప్పారు. గ్రామాలు, పట్టణాలలో ఇకపై పార్టీ కార్యకర్తలు సూచించిన వారికే ఇళ్ల్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరు జరుగుతుందన్నారు. తాను కూడా కార్యకర్తల ప్రాధాన్యం కోసం ఇదే పద్ధతిని అవలంభిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకూ టీఆర్ఎస్ పార్టీ బతికే ఉంటుందని, రెండు దశాబ్దాల తరువాత కేసీఆర్ తదనంతరం సీఎం పగ్గాలు చేపట్టేందుకు పార్టీలో సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడని అన్నారు.
