న్యూఢిల్లీ: దేశీయంగా టెలికాం పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు గాను రూ.12,195 కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశీయంగా సుమారు రూ.2.44 లక్షల కోట్ల విలువైన టెలికాం పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించటంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 40 వేల మందికి ఉపాధి అవకాశాలకు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. టెలికాం గేర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పీఎల్ఐ పథకం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.2,44,200 కోట్ల విలువైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.1,95,360 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతులు చేసే అవకాశం ఉందన్నారు.

అలాగే ప్రభుత్వానికి దాదాపు రూ.17,000 కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రసాద్ తెలిపారు. సులభతర వాణిజ్యానికి సానుకూలమైన వాతావరణం సృష్టించటంతో పాటు అంతర్జాతీయ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా భారత్ను తీర్చిదిద్దాలనేనది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. టెలికాం పరికరాల విభాగంతో పాటు 5జీ పరికరాల తయారీలో మేకిన్ ఇండియాను మరింతగా ప్రోత్సహించేందుకు పీఎల్ఐ పథకం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఎంఎ్సఎంఐ రంగాన్ని ప్రమోట్ చేయటం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్ల పాటు టెలికాం రంగానికి రూ.12,195 కోట్ల ప్రోత్సాహకాలను అందించనున్నట్లు చెప్పారు. దేశీయంగా టెలికాం ఉత్పత్తులు తయారైతే రూ.50,000 కోట్లకు పైబడిన ఎగుమతులను తగ్గించుకునే వెసులుబాటు లభిస్తుందన్నారు. కాగా అగ్ర శ్రేణి మిలిటరీ అధికారులకు రూ.200 కోట్ల వరకు ఆర్థికాధికారాలు కట్ట బెట్టేందుకు కేబినెట్ ఓకే చెప్పింది.
మారిషస్తో వాణిజ్య ఒప్పందం
భారత్కు చెందిన 300కు పైగా ఉత్పత్తులను మారిషస్ మార్కెట్లో విక్రయించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) కుదుర్చుకునేందుకు ప్రధాని మోదీ సారథ్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ, టెక్స్టైల్స్, ఎలకా్ట్రనిక్స్ ఉత్పత్తులు సహా ఇతర రంగాలకు చెందిన ఉత్పత్తులు రాయితీలతో కూడిన కస్టమ్స్ సుంకాలతో మారిషస్ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం లభించనుంది.