హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2021 తొలివిడుత పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు పరీక్షలు ఆన్లైన్లో జరుగనున్నాయి. బీటెక్ సీట్ల కోసం పేపర్-1, బీఆర్క్-బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. బీఆర్క్కు పేపర్-2ఏ, బీ ప్లానింగ్కు పేపర్-2బీ ప్రశ్నాపత్రాలు ఉంటాయి. మొదటి రోజు పేపర్-2 పరీక్ష, తర్వాత మూడు రోజులు పేపర్-1 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలను రెండు విడుతలుగా నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. తొలిసారిగా ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగు, మరో 11 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా 1,61,579 మంది విద్యార్థులు పేపర్-1, పేపర్-2 పరీక్షలు రాయనున్నారు. ఇందులో రాష్ట్రం నుంచి 73,782 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేటలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. కరోనా నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్టికెట్పై ముద్రించిన నిబంధనలను పూర్తిగాచదవాలని, వాటిని తప్పనిసరిగా పాటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.
జేఈఈ అడ్మిట్కార్డు ఒక్క పరీక్షకే
జేఈఈ మెయిన్స్కు హాజరయ్యే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ ఈ ఒక్క పరీక్షకే వర్తిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. మిగతా మూడు సెషన్లకు అడ్మిట్ కార్డులను వేర్వేరుగా ఆయా పరీక్షల సమయాల్లో జారీచేస్తామని వెల్లడించింది. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జరిగే పరీక్షలకు అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో పొందుపరుస్తామని ఎన్టీఏ తెలిపింది.