నూతన వ్యవసాయ చట్టాలతో రైతుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, గ్రామాల రూపురేఖలు మారిపోతాయని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి సాగు చట్టాల ఆవశ్యకతను వివరించాలని సూచించారు. ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత ఏడాది బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించిన తరువాత కొత్తగా నియమితులైన పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, వివిధ విభాగాల అధ్యక్షులతో తొలిసారి ఈ సమావేశం నిర్వహించారు. మోదీ తన రాజకీయ జీవితంలోని అనుభవాలను భావోద్వేగంగా పంచుకున్నారని సీనియర్ నేత ఒకరు చెప్పారు. తన రాజకీయ ప్రయాణం అడుగడుగునా ముళ్లబాట అని, తాను ఏనాడూ తన గురించి వ్యక్తిగతంగా ఆలోచించలేదని చెప్పారని తెలిపారు.
