ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎ్సఈ) ట్రేడింగ్ కార్యకలాపాలు బుధవారం నాడు 4 గంటలకుపైగా స్తంభించిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఉదయం 11.40 గంటలకు నిలిచిపోయిన ట్రేడింగ్.. మధ్యాహ్నం 3.45 గంటలకు పునఃప్రారంభమైంది. ఎక్స్ఛేంజ్లో ఉదయం 9.15 గంటలకు యధావిధిగా ట్రేడింగ్ ప్రారంభమైనప్పటికీ.. 10 గంటల నుంచే పలు సూచీల అప్డేషన్లో సమస్యలు తలెత్తాయి. దాంతో ఎక్స్ఛేంజ్ 11.40కి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ), 11.43కు క్యాష్ మార్కెట్ విభాగాల ట్రేడింగ్ను నిలిపివేసింది. బీఎ్సఈలో మాత్రం ట్రేడింగ్ యథాతథంగా కొనసాగింది.

కారణమిది: ఎన్ఎ్సఈకి కనెక్టివిటీ సేవలందించే టెలికాం ఆపరేటర్లు ఏకకాలంలో విఫలమవడం ట్రేడింగ్ నిలిచిపోవడానికి కారణమైంది. ’’రెండు టెలికాం కంపెనీల నుంచి ఎక్స్ఛేంజ్ పలు కనెక్షన్లను కలిగి ఉంది. కనెక్టివిటీలో సమస్యలు తలెత్తాయని ఇరువురు ఆపరేటర్లు తమకు సమాచారం అందించార’’ని ఎన్ఎ్సఈ ప్రకటించింది. ఎక్స్ఛేంజ్కు కనెక్టివిటీ సేవలందిస్తోన్న ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు..
5 గంటల వరకు ట్రేడింగ్: సాధారణంగా ఎన్ఎ్సఈ, బీఎ్సఈలో మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగుస్తుంది. సాంకేతిక సమస్య పరిష్కృతమయ్యేసరికి ఆలస్యమవడంతో ట్రేడర్ల సౌకర్యార్థం ఎన్ఎ్సఈ 3.45 గంటలకు ట్రేడింగ్ను తిరిగి ప్రారంభించింది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించింది. ఎన్ఎ్సఈతో పాటు బీఎ్సఈ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎంఎ్సఈఐ) కూడా ఐదింటి వరకు ట్రేడింగ్ను కొనసాగించాయి.
వివరణ కోరిన సెబీ: కనెక్టివిటీ సమస్యలు తలెత్తాక డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి ట్రేడింగ్ కొనసాగించకపోవడానికి కారణాలు తెలపాలని ఎన్ఎస్ఈను సెబీ వివరణ కోరింది. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా గతంలోనూ ఎన్ఎస్ఈలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
సెన్సెక్స్ 1,030 పాయింట్లు అప్
బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ షేర్లలో కొనుగోళ్లు పోటెత్తడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు రివ్వున ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,030.28 పాయింట్లు (2.07 శాతం) బలపడి 50,781.69 వద్దకు చేరుకుంది. ఎన్ఎ్సఈ నిఫ్టీ 274.20 పాయింట్లు (1.86 శాతం) పెరిగి 14,982 వద్ద ముగిసింది. కొనుగోళ్ల దన్నుతో బీఎ్సఈ లిస్టెడ్ కంపెనీల విలువరూ.2.60 లక్షల కోట్లు పెరిగి రూ.203.98 లక్షల కోట్లకు చేరుకుంది.