నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి స్వప్న సినిమాస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలై విజయఢంకా మోగిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ బ్లాక్ బస్టర్ హిట్గా దూసుకుపోతోంది. మధ్యలో మూడు చిత్రాలు మార్చి 19న విడుదలైనా.. కూడా ఈ చిత్రం హౌస్ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుందంటే.. ప్రేక్షకులు ఈ చిత్రానికి ఎలా బ్రహ్మరథం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘జాతిరత్నాలు’ బాక్సాఫీస్ని కలెక్షన్లతో కుమ్మేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం రూ. 50 కోట్ల గ్రాస్ సాధించినట్లుగా చిత్రవర్గాలు తెలుపుతున్నాయి. ఇక్కడే కాదు.. యుఎస్లో కూడా ఈ చిత్రం దుమ్మురేపుతుండటం విశేషం. కరోనా అన్లాక్ తర్వాత యుఎస్లో విడుదలైన చిత్రాల్లో ఏ చిత్రం సాధించని కలెక్షన్లను అక్కడ ఈ చిత్రం సాధిస్తుండటం విశేషం. అలాగే రీసెంట్గా విడుదలైన చిత్రాల టాక్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. మళ్లీ శుక్రవారం వచ్చే వరకు ఈ సినిమా హవా ఇలాగే కొనసాగేలా కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే.. ఈ విజయాన్ని చిత్రయూనిట్ కూడా ఊహించి ఉండరు.. అలా ‘జాతిరత్నాలు’ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.