కరోనాతో గత సంవత్సరం ప్రజలు ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేశారో తెలియంది కాదు. కరోనా కారణంగా ఏర్పడిన లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. షూటింగ్స్ లేక సినీ కార్మికులు ఎంతగానో ఇబ్బందులను ఫేస్ చేశారు. ఇక అన్లాక్ ప్రకటించిన తర్వాత కాస్త పర్వాలేదు అనుకుంటున్న పరిస్థితుల్లో మరోసారి కరోనా తన ఉదృతిని మొదలెట్టింది. భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో.. మళ్లీ లాక్డౌన్ అనేలా వార్తలు వినిపిస్తుంటే.. ఒక్కొక్కరిలో భయాందోళనలు మొదలవుతున్నాయి. కాస్త సినిమా ఇండస్ట్రీ కుదురుకుంటోంది అనుకుంటున్న సమయంలో.. సెలబ్రిటీలందరూ కరోనా బారిన పడుతుండటంతో.. ఇండస్ట్రీలో కూడా ఆందోళన మొదలైంది. బాలీవుడ్లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడి, క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా టాలీవుడ్కి సంబంధించి ‘వకీల్ సాబ్’ నటి నివేదా థామస్ కరోనా బారిన పడినట్లుగా.. ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 9న విడుదల కాబోతోన్న ‘వకీల్ సాబ్’ టీమ్లో టెన్షన్ మొదలైంది.

చిత్రీకరణకు సంబంధించి ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది కాబట్టి.. సినిమాకు పనిచేసిన వారు భయపడాల్సిన అవసరం లేదు కానీ.. నివేదా థామస్ రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలలో దర్శకుడు వేణు శ్రీరామ్, అంజలి, థమన్, అనన్య నాగళ్ల వంటి వారితో ఆమె మూవ్ అయింది. రీసెంట్గా దర్శకుడు శ్రీరామ్ వేణు కూడా సినిమాలో చేసిన ముగ్గురు నటీమణులతో ఫొటోలకు ఫోజిచ్చాడు. దీంతో ‘వకీల్ సాబ్’ టీమ్ అంతా ఇప్పుడు టెన్షన్లో మునిగిపోయింది. ”నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాను. డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వస్తాను. నాకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మెడికల్ టీమ్కు ధన్యవాదాలు.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, క్షేమంగా ఉండండి..” అని నివేదా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.