తెలుగు సినీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు చూసి ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా టాలీవుడ్ స్టార్స్, దర్శకులు, నిర్మాతలు మారుతున్నారు. అందరి మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఏర్పడుతున్నాయి. చిత్ర నిర్మాతల విషయానికి వస్తే.. సినిమా రిలీజ్ డేట్స్ సహా సినిమాలకు సంబంధించిన చిన్నా చితకా సమస్యలపై నిర్మాతలు అందరూ దాదాపు డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసుకుని మనస్పర్ధలు పెంచుకోకుండా సర్దుకు పోతున్నారు. అందుకు ఉదాహరణగా సినీ ఇండస్ట్రీలో మరో సంఘటన జరిగినట్లు ఫిల్మ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

వివరాల్లోకి వెళితే.. సందీప్కిషన్, నేహా శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రానికి జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రౌడీ బేబీ’ అనే టైటిల్ను ఖరారు కూడా చేశారు. షూటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ను మార్చబోతున్నారంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. వర్కింగ్ టైటిల్ మారడం అనేది కామన్గా జరిగే విషయం. అయితే అనౌన్స్ చేసిన టైటిల్ను మార్చడం అంటే చిత్ర యూనిట్ లోతుగానే ఆలోచించుకుంటుంది. అయినా కూడా చిత్ర యూనిట్ టైటిల్ మార్చాలని నిర్ణయించుకోవడం వెనుక అసలు కారణమేంటో తెలుసా? ప్రముఖ నిర్మాత దిల్రాజు. అసలు దిల్రాజుకి.. ‘రౌడీ బేబీ’కి లింకేంటి? అని ఆలోచిస్తున్నారా!.. వివరాల్లోకి వెళితే, దిల్రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు హీరోగా త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా కూడా సెట్స్పై ఉంది. ఈ చిత్రానికి ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ను అనుకున్నారు. రౌడీ బాయ్స్.. రౌడీ బేబీ టైటిల్ దగ్గర దగ్గరగా ఉన్నట్లు అనిపించడంతో నిర్మాత దిల్రాజు వ్యవహారాన్ని చక్క బెట్టడానికి ముందుకు వచ్చారు. ‘రౌడీ బేబీ’ చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరిస్తోన్న రైటర్ కోన వెంకట్ను, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణను టైటిల్ మార్పు విషయమై సంప్రదించాడట. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్రాజు కోరడంతో కోనవెంకట్, ఎంవీవీ సత్యనారాయణ .. తమ సినిమా టైటిల్ను మార్చుకోవడానికి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.