అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన మరుసటి రోజు నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతాలు, సెలవులు, పండుగల సమయంలో భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో దర్శన వేళల్లో శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ మార్పులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అయోధ్య బాలక్ రామ్ దర్శనానికి ప్రతి రోజూ గంట సమయం పాటు విరామం ఇవ్వనున్నట్లు అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
ఇకపై ప్రతి రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు ఆలయ ద్వారాలను మూసిఉంచనున్నట్లు పేర్కొన్నారు. మందిరంలో రాముడు ఐదేళ్ల బాలుడిగా దర్శనమిస్తున్నాడని.. ప్రతి రోజూ ఎక్కువగా మేలుకొని ఉండడంతో ఒత్తిడిపడుతుందని.. ఆయన బాలుడు కనుక ఒత్తిడిని తట్టుకోలేడని తెలిపారు. దాంతో బాల రాముడికి కొంత సమయం విశ్రాంతి ఇచ్చేందుకు గంట సమయం గర్భాలయం ద్వారాలను మూసి ఉంచనున్నట్లు ట్రస్ట్ నిర్ణయించిందని తెలిపారు.
ఇదిలా ఉండగా.. జనవరి 22న అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. 23వ తేదీ నుంచి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. లక్షల్లో తరలివస్తుండడంతో దర్శన సమయాలను పొడిగించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అనుమతిస్తున్నారు. అకు ముందు దర్శన వేళలు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు ఉండేవి. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేశారు.