ఎన్నికల సంఘం వర్గాల వెల్లడి
యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తున్న లోక్సభ ఎన్నికలకు షెడ్యూలు అతి త్వరలో విడుదల కానున్నది. మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీల ప్రకటన ఉంటుందని ఎన్నికల సంఘం వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నదని, అవి ముగియగానే తేదీల ప్రకటన ఉంటుందని పేరు రాయడానికి నిరాకరించిన ఒక అధికారి తెలిపారు. సీఈసీ అధికారులు ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. దాని తర్వాత ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నారు.
మార్చి 13తో రాష్ట్రాల పర్యటనలు ముగియనున్నాయి. గత కొద్ది నెలలుగా ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నది. సున్నిత ప్రాంతాల వివరాలు, ఈవీఎంల తరలింపు, తమ తమ రాష్ట్రాలకు అవసరమైన భద్రతా సిబ్బంది, సరిహద్దుల వద్ద నిఘాను తీవ్రతరం చేయడం వంటి అంశాలపై ఆయా రాష్ట్రాల సీఈవోలు కేంద్ర అధికారులకు సమాచారం ఇచ్చారు.
కృత్రిమ మేధతో ఎన్నికలు
సాధారణంగా ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, ఉద్వేగాలు రెచ్చగొట్టే వదంతులు ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కృత్రిమ మేధ సహాయాన్ని ఎన్నికల కమిషన్ తీసుకుంటున్నది. డిజిటల్ ప్లాట్ఫారాలు, సామాజిక మాధ్యమాల్లో తిరుగాడే తప్పుడు సమాచారాలను ఇది గుర్తించి, తొలగిస్తుంది. పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినా సదరు అభ్యర్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను ఎన్నికల కమిషన్ నిలిపివేస్తుంది.